సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సినీ రంగ ప్రభావం దెబ్బతినకుండా, రాజకీయ భవిష్యత్ ను కాపాడుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆ పార్టీ విడుదల చేసిన మీడియా ప్రకటన కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ ప్రకటనలో జనసేన పేరును కానీ, పవన్ కళ్యాణ్ పేరును కానీ దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు వెలువరిస్తే అందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఎన్నికల సంఘం నుంచి పార్టీకి గుర్తింపు అందిన వెంటనే పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరుపున పవన్ ప్రచారం చేసి, ఆ పార్టీల విజయం లో తన వంతు పాత్ర పోషించారు. ప్రచారం లో ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీఆర్ఎస్, వైసీపీ లపై నిప్పులు చేరిన పవన్, టీడీపీ, బీజేపీ లు అధికారం లోకి వచ్చిన ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రశ్నిస్తానంటూ కూడా తెలిపారు. పవన్ ప్రచారం చేసిన ఎన్డీఎ అధికారం లోకి రాగానే ధరలు పెంచడం తో ఈ అంశాన్ని జగన్ కు చెందిన సాక్షి ప్రస్తావించింది. దీంతో జగన్ కు చెందిన సాక్షికి సమాధానంగా గురువారం జనసేన పార్టీ ప్రకటన వెలువరించిందని, అంతేకాకుండా పార్టీ కి ఈసీ గుర్తింపు వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం ద్వారా తాను ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని పవన్ చెప్పినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవన్ పలు సినిమాలలో బిజీగా ఉండగా , త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మద్దతుతో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment